Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఖమ్మం కూల్చివేతలు..700 మంది నిరాశ్రయులయ్యారు: క‌విత‌

ఖమ్మం కూల్చివేతలు..700 మంది నిరాశ్రయులయ్యారు: క‌విత‌

Gaddamidi Naveen
9 మార్చి, 2026

ఖమ్మం జిల్లా కేంద్రం పరిధిలోని వేలుగుమట్ల గ్రామ వినోబా నగర్‌లో జరిగిన సామూహిక గృహాల కూల్చివేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం ఒక్క రోజులోనే 700 మంది పేదలను నిరాశ్రయులను చేయడం అమానుషమని ఆమె మండిపడ్డారు. సోమవారం బాధితులను పరామర్శించిన ఆమె, ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వెంటనే క్షేత్రస్థాయికి వచ్చి బాధితుల దుస్థితిని చూడాలని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనలో ప్రజలను వారి ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు పంపించి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారని కవిత ఆరోపించారు. బాధితులను పునరావాస కేంద్రాల్లో జంతువుల మాదిరిగా ఉంచుతున్నారని ఆమె విమర్శించారు. చిన్నపిల్లలు మందుల కోసం ఏడుస్తున్నారని, పరీక్షల కాలం కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేకపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని, ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించాలని కోరారు.

ఖమ్మం జెడ్పీ సెంటర్లో ఆందోళన చేస్తున్న కవిత, విశారదన్ మహరాజ్ సహా వెలుగుమట్ల బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే కవితను అరెస్టు చేయడంపై జాగృతి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసుల తీరును వారు తప్పుబట్టారు.

వివాదానికి నేపథ్యం: భూదాన భూములా? కబ్జాలా?

ఫిబ్రవరి చివరలో జరిగిన ఈ కూల్చివేతలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. ప్రభుత్వ వాదన ప్రకారం.. భూదాన్ ఉద్యమం కింద భూమిలేని పేదలకు పంచాల్సిన భూములను కొందరు అక్రమంగా కబ్జా చేసి, నకిలీ పత్రాలతో ఇళ్లు నిర్మించారు. అందుకే వీటిని కూల్చివేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ చర్యను సమర్థిస్తూ, భూకబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, అర్హులైన పేదలకు 'ఇందిరమ్మ' పథకం కింద ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇళ్లను కోల్పోయిన బాధితుల్లో చాలా మంది కూలీలు ఉన్నారని, వారిని తాత్కాలికంగా అంబేద్కర్ భవన్, ఇతర ఫంక్షన్ హాళ్లలోకి తరలించినట్లు సమాచారం. అయితే అక్కడ తాగునీరు, ఆహారం, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు సరిపడా లేవని బాధితులు వాపోతున్నారు.

విపక్షాల ఆరోపణలు

ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఈ కూల్చివేతలు హైకోర్టు ‘స్టేటస్ కో’ ఆదేశాలను ఉల్లంఘించి జరిగాయని ఆరోపించారు. కొత్త కలెక్టర్ కార్యాలయం, ప్రతిపాదిత రహదారికి సమీపంలో ఉండటంతో ఈ భూమికి వాణిజ్య విలువ పెరిగిందని, అందుకే అకస్మాత్తుగా ఈ చర్యలు చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 26న బాధిత ప్రాంతాన్ని సందర్శించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం 'బుల్డోజర్ పాలన' సాగిస్తోందని విమర్శించారు. 1950ల్లో వినోబా భావే స్పూర్తితో పేదలకు పంచిన 62 ఎకరాల భూమిలో, 2014లో 1,895 మందికి పట్టాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఆస్తి పన్ను రశీదులు, విద్యుత్ కనెక్షన్లు ఉన్న ఇళ్లను అర్ధరాత్రి పూట భారీ పోలీసు బలగాలతో కూల్చివేయడం అన్యాయమని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు తక్షణ పునరావాసం కల్పించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. అవసరమైతే ఈ అంశాన్ని ఉన్నత న్యాయస్థానాల్లో తీసుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు తెలిపారు.

ఖమ్మం కూల్చివేతలు..700 మంది నిరాశ్రయులయ్యారు: క‌విత‌ - Tholi Paluku