
టర్కీ తీరంలో పడవ ప్రమాదం.. 14 మంది వలసదారుల మృతి
టర్కీ తీరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సోమవారం మధ్యధరా సముద్రంలో వలసదారులతో వెళ్తున్న ఒక బోటు, అక్కడి కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నౌకను ఢీకొనడంతో 14 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తీర రక్షక దళాల నుంచి తప్పించుకోవడానికి వలసదారులు తమ బోటును వేగంగా నడపడం, ఆ క్రమంలో అది కోస్ట్ గార్డ్ నౌకను బలంగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
తప్పించుకునే ప్రయత్నమే ప్రాణం తీసింది
అంటాల్యా ప్రావిన్స్లోని డెమ్రే తీరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానిక గవర్నర్ హులుసీ సాహిన్ వెల్లడించారు. అఫ్గానిస్థాన్కు చెందిన వలసదారులతో వెళ్తున్న ఒక నౌకను గుర్తించిన తీర రక్షక దళాలు, దానిని ఆపాల్సిందిగా పదేపదే ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ నౌక అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, తప్పించుకోవడానికి అధిక వేగంతో ప్రమాదకరమైన విన్యాసాలు చేసింది. ఈ క్రమంలోనే కోస్ట్ గార్డ్ బోటును సదరు వలసదారుల నౌక బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ధాటికి వలసదారుల నౌక నీట మునిగిపోయింది.
సహాయక చర్యలు.. గాలింపు ముమ్మరం
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రంలో మునిగిపోతున్న ఏడుగురిని సురక్షితంగా బయటకు తీశాయి. వారికి ప్రస్తుతం అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎలాగోలా ఈదుకుంటూ తీరానికి చేరుకున్న 14 మందిని గెండర్మెరీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సముద్రంలో ఇంకా ఎవరైనా గల్లంతయ్యారేమోనన్న అనుమానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గాలి, నీరు, భూమార్గాల్లో సహాయక బృందాలు గాలిస్తున్నాయి.
సమగ్ర విచారణకు ఆదేశం
ఈ ఘటనపై టర్కీ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. దీనిపై అటు న్యాయపరంగా, ఇటు పరిపాలనా పరంగా సమగ్ర విచారణకు అధికారులు ఆదేశించినట్లు ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ అనడోలు వెల్లడించింది. వలసదారుల నౌకను నడుపుతున్న వారెవరు? అసలు ప్రమాదానికి ప్రధాన కారణాలేమిటి? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
