Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి హైకోర్టు నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి హైకోర్టు నోటీసులు

Pinjari Chand
9 మార్చి, 2026

ఢిల్లీ మద్యం విధానం కేసులో ట్రయల్ కోర్టు నుంచి విముక్తి పొందిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు మరో 21 మందికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్ (సీబీఐ) వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం వారి అభిప్రాయం కోరింది. న్యాయమూర్తి స్వరనా కాంత శర్మ అందరికీ నోటీసులు జారీ చేసి, ఈ పిటిషన్‌పై విచారణను మార్చి 16కు వాయిదా వేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ విచారణను నిర్వహిస్తున్న ఈడీ కేసులో ట్రయల్ కోర్టు తదుపరి చర్యలను కూడా తాత్కాలికంగా వాయిదా వేయాలని హైకోర్టు సూచించింది. సీబీఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ట్రయల్ కోర్టు తీర్పులో ఉన్న ‘హానికర వ్యాఖ్యలను’ నిలిపివేయాలని కోర్టును కోరారు. అలాగే సీబీఐ పిటిషన్‌పై త్వరగా తుది విచారణ జరపాలని అభ్యర్థించారు.

మెహతా వాదిస్తూ, ట్రయల్ కోర్టు ఇచ్చిన విముక్తి ఉత్తర్వు తప్పుదారి పట్టిందని, క్రిమినల్ చట్ట వ్యవస్థను తలకిందులు చేసినట్టుగా ఉందని అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు రాజధాని చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కేసులలో ఒకటని ఆరోపించారు. కేసులో కుట్ర, లంచాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, ట్రయల్ కోర్టు సరైన విచారణ లేకుండానే కేజ్రీవాల్, సిసోడియా తదితరులకు విముక్తి కల్పించిందని పేర్కొంది. నిందితులు సుమారు 170 మొబైల్ ఫోన్లను మార్చడం లేదా నాశనం చేయడం ద్వారా ఆధారాలను తొలగించేందుకు ప్రయత్నించారని కూడా ఆరోపించింది.

ఈ వ్యవహారంలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021–22ను అక్రమ ప్రయోజనాల కోసం మార్పులు చేశారని, ఆ డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఖర్చులకు ఉపయోగించారని సీబీఐ వాదించింది. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు కేజ్రీవాల్, సిసోడియా సహా 21 మందికి క్లిన్ చిట్ ఇచ్చింది. సీబీఐ సమర్పించిన కేసు న్యాయపరీక్షను తట్టుకోలేదని పేర్కొంది. కేసులో విముక్తి పొందిన వారిలో కే.కవిత కూడా ఉన్నారు. కేజ్రీవాల్ ఈ కేసులో ఆరు నెలలు జైలులో ఉండగా, సిసోడియా దాదాపు రెండు సంవత్సరాలు జైలులో గడిపారు. ట్రయల్ కోర్టు ప్రకారం, ఈ కేసులో చూపిన కుట్రకు సరైన న్యాయ ఆధారాలు లేవని, కేవలం ఊహాగానాలపై ఆధారపడి కేసు నడిపినట్లు కనిపించిందని వ్యాఖ్యానించింది. కానీ సీబీఐ తన పిటిషన్‌లో ఈ తీర్పు చట్టపరంగా తప్పిదాలతో కూడుకున్నదని, కేసు విషయాలను సరైన రీతిలో పరిశీలించలేదని పేర్కొంది.

మోడీ దేవుడు కాదు - సిసోడియా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన విముక్తి ఉత్తర్వును సీబీఐ సవాల్ చేసిన నేపథ్యంలో, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ పై విమర్శలు చేశారు. మోడీ దేవుడు కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్‌లోని వైష్ణో దేవీ ఆలయంలో దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన సిసోడియా, ఈ కేసు మొదటి నుంచే తప్పుడు కేసు అని అందరికీ తెలిసిందన్నారు. కోర్టు నిర్ణయంతో తమపై వచ్చిన ఆరోపణలు అసత్యమని బయటపడిందని ఆయన చెప్పారు. కోర్టు నుంచి ఉపశమనం వచ్చినప్పటికీ ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు కొనసాగించడం ద్వారా మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. దేవుడు ఎవరు సరైన మార్గంలో ఉన్నారు, ఎవరు తప్పు చేస్తున్నారు అన్నది చూస్తున్నాడు. కానీ మోడీ దేవుడు కాదని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి హైకోర్టు నోటీసులు - Tholi Paluku