
ప్రజల ఆశయాల సాధనమే ప్రభుత్వ సంకల్పం: ప్రధాని మోడీ
ప్రజల ఆశయాలను నెరవేర్చడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దేశాభివృద్ధిలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి వంటి రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన పోస్ట్-బడ్జెట్ వెబినార్లో ప్రసంగించిన ప్రధాని, దేశ విద్యా వ్యవస్థను వాస్తవ ఆర్థిక వ్యవస్థతో మరింత బలంగా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ, డిజైన్ ఆధారిత తయారీ వంటి రంగాలపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రజల ఆశయాలను నెరవేర్చడం ఒక అంశం మాత్రమే కాదు, అది ఈ ప్రభుత్వ లక్ష్యం, సంకల్పమని ఆయన అన్నారు. ఈ వెబినార్లో వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు, అలాగే ప్రైవేట్ రంగ నిపుణులు పాల్గొన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి వంటి రంగాలు ప్రజల ఆశయాలను నెరవేర్చే ప్రధాన మార్గాలుగా పనిచేస్తాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ విద్యా వ్యవస్థను వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో దేశం మరింత దృష్టి పెట్టాలని అన్నారు. అదే సమయంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(ఎస్టీఈఎం) రంగం కూడా చాలా ముఖ్యమని ప్రధాని చెప్పారు. ఈ రంగాలపై దేశంలోని యువతుల్లో, ముఖ్యంగా బాలికల్లో పెరుగుతున్న ఆసక్తి సంతోషకరమని పేర్కొన్నారు.
భవిష్యత్ సాంకేతికతల గురించి మాట్లాడుతున్న సమయంలో, అవకాశాల లేమి వల్ల దేశంలోని ఏ కుమార్తె కూడా వెనుకబడకూడదని ఆయన అన్నారు. యువ పరిశోధకులు కొత్త ఆలోచనలపై పని చేయడానికి ఎక్కువ అవకాశాలు లభించేలా పరిశోధనా వాతావరణాన్ని సృష్టించాలని సూచించారు.
ఆరోగ్య రంగం కూడా గత కొన్నేళ్లలో బలపడిందని ప్రధాని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ యోజన, ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు విస్తరించాయని ఆయన అన్నారు. కేర్ ఎకానమీ గురించి ప్రస్తావిస్తూ, శిక్షణ పొందిన సంరక్షకులు వృద్ధులకు సేవలు అందించే వ్యవస్థకు భవిష్యత్తులో ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సంరక్షకుల అవసరం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా కొత్త శిక్షణా నమూనాలు అభివృద్ధి చేయాలని సూచించారు. దేశం ప్రస్తుతం ప్రివెంటివ్, హోలిస్టిక్ హెల్త్ దిశగా ముందుకు సాగుతోందని ప్రధాని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల్లో దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలు బలపడ్డాయని చెప్పారు. అనేక జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయని, అలాగే ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ద్వారా వెల్నెస్ కేంద్రాల ద్వారా గ్రామాలకు ఆరోగ్య సేవలు చేరాయని పేర్కొన్నారు. దేశంలోని ‘యువ శక్తి’ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. ఆరోగ్యంగా, క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే యువ శక్తి జాతీయ శక్తిగా మారుతుందని ఆయన అన్నారు. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా క్రీడలను జాతీయ అభివృద్ధిలో కీలక భాగంగా భావిస్తున్నామని చెప్పారు. ఖేలో ఇండియా వంటి కార్యక్రమాలు దేశ క్రీడా వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని, దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలు బలపడుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.
