
బుల్కాపూర్ వద్ద పగిలిన భారీ పైప్లైన్
హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్లైన్ పగిలిపోవడంతో చేపట్టిన అత్యవసర మరమ్మతు పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున స్వయంగా పరిశీలించారు. బుల్కాపూర్ గ్రామం వద్ద ద్వంసమైన 1200 మిల్లీమీటర్ల గల పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్లైన్పై జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు.
మరమ్మతు పనుల ప్రస్తుత పరిస్థితిపై ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్మిషన్ విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్న ఎండీ, సమన్వయంతో వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. పైప్లైన్ లీకేజీ కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని అధికారులకు ఆదేశించారు.
సింగపూర్ నుంచి ఖానాపూర్ వరకు వెళ్లే ఈ 1200 మిల్లీమీటర్ల వ్యాసం గల పైప్లైన్ సోమవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో బుల్కాపూర్ వద్ద పగిలినట్లు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే మరింత నీటి వృథా జరగకుండా ఉండేందుకు సింగపూర్, ఖానాపూర్ ప్రాంతాల నుంచి నీటి సరఫరాను అధికారులు తక్షణమే నిలిపివేశారు. అనంతరం అత్యవసర ప్రాతిపదికన మరమ్మతు చర్యలు ప్రారంభించి ఉదయం 7 గంటల నుంచి పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ఈ పైప్లైన్ పగిలిన కారణంగా గండిపేట్, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల, పుప్పాలగూడ, ఖానాపూర్, మణికొండ ప్రాంతాలతో పాటు షేక్పేట్ రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. అలాగే బోజగుట్ట రిజర్వాయర్ కమాండ్ పరిధిలోని ప్రాంతాల్లో కూడా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
