Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
బ్లాక్ చెయిన్ సాంకేతికతతో భూరికార్డులకు పటిష్ట రక్షణ: సీఎం

బ్లాక్ చెయిన్ సాంకేతికతతో భూరికార్డులకు పటిష్ట రక్షణ: సీఎం

Panthagani Anusha
9 మార్చి, 2026

భూ రికార్డుల పారదర్శకతలో భాగంగా నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలోని కొత్తబురుజు గ్రామంలో సోమవారం నూతన పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు పాల్గొని రైతులకు కొత్తగా ముద్రించిన భూ పత్రాలను అందజేశారు. పారదర్శకమైన పాలనే లక్ష్యంగా సాంకేతికతను జోడించి ఈ పుస్తకాలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్వయంగా ఇద్దరు గ్రామస్తుల బొటనవేలి ముద్రలను డిజిటల్‌ పద్ధతిలో నమోదు చేయించి రికార్డుల నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో పాసుపుస్తకం కోసం రైతులు ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అవినీతికి తావులేకుండా మీ ఇంటి వద్దకే పట్టా పుస్తకాలు వస్తున్నాయి" అని ప్రకటించారు. ఈ కొత్త పుస్తకాల్లో అత్యాధునిక క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ సాంకేతికతను వాడినట్లు ఆయన వివరించారు. దీనివల్ల రికార్డులను ఎవరూ తారుమారు చేయలేరని, ఒకవేళ ఎవరైనా అధికారి తప్పుగా మార్చాలని చూస్తే వెంటనే వ్యవస్థ పసిగడుతుందని రైతులకు భరోసా ఇచ్చారు.

ఇక గత ప్రభుత్వం తీసుకొ చ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. రైతుల భూములపై అజమాయిషీని ఎవరో వ్యక్తులకు అప్పగించేలా ఆనాడు కుట్రలు జరిగాయి. కోర్టుకు వెళ్లే హక్కును కూడా కాలరాశారు. ఎన్నికల ముందే నేను మాట ఇచ్చాను అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేస్తానని. అన్నట్లుగానే మొదటి రోజే ఆ దారుణమైన చట్టాన్ని రద్దు చేశాం" అని గుర్తుచేశారు. గతంలో సర్వే రాళ్లపై ఫోటోలు ముద్రించి రూ.750 కోట్లు ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.

అంతకుముందు సభా ప్రాంగణం వద్ద ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ పంటల నాణ్యత, మార్కెట్ ధరలపై ఆరా తీశారు. ముఖ్యంగా పండ్లకు కవర్లు కట్టడం వంటి ఆధునిక పద్ధతుల వల్ల తెగుళ్ల నివారణతో పాటు మార్కెట్‌లో మంచి ధర లభిస్తోందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ఆలోచనలను అభినందించిన ముఖ్యమంత్రి తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఇచ్చే ఉద్యాన పంటల రకాలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా వ్యవసాయానికి వెన్నెముక అయిన భూగర్భ జలాల పరిరక్షణపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచేందుకు అవసరమైన చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి, నీటి నిల్వలను పెంచడం ద్వారా రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

బ్లాక్ చెయిన్ సాంకేతికతతో భూరికార్డులకు పటిష్ట రక్షణ: సీఎం - Tholi Paluku