
మూసీ ప్రక్షాళన.. 'నైట్ ఎకానమీ'తో ఉపాధి అవకాశాలు: సీఎం రేవంత్ రెడ్డి
మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టు కేవలం పర్యావరణ పరిరక్షణే కాకుండా, నగర యువతకు భారీస్థాయిలో ఉపాధి, జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ శివరాంపల్లిలో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించిన బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
పాతబస్తీలో వ్యాపారాలు అర్ధరాత్రి వరకు సాగుతాయని, పోలీసు ఆంక్షల వల్ల వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేస్తోందని సీఎం తెలిపారు. నది అభివృద్ధితో వ్యాపారాలు రాత్రి అంతా నడిచేలా ‘నైట్ ఎకానమీ’ని ప్రోత్సహిస్తాము అని ఆయన పేర్కొన్నారు. మూసీ పునరుద్ధరణ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, జీవనోపాధి అవకాశాలు కల్పించబడతాయని,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది తోడ్పడుతుందని సీఎం చెప్పారు.
అసదుద్దీన్ ఓవైసీ సహకారం కోరిన సీఎం
ఈ అభివృద్ధి పనుల్లో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహకారాన్ని ముఖ్యమంత్రి కోరారు. మీరు (ఓవైసీ) మీ కార్యకర్తలకు, అనుచరులకు దిశానిర్దేశం చేస్తే మూసీ ప్రక్షాళన ప్రక్రియ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపులో ఎటువంటి లోటు ఉండదని హామీ ఇచ్చారు.ఈ సిటీని అభివృద్ధి చేయడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టామని, రెండు రోజుల కిందట కొత్వాల్గూడ్ ఎకో పార్క్ను ప్రారంభించుకున్నామని, సాధ్యమైన తొందరగా మెట్రో విస్తరణ పనులను పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు.
హైదరాబాద్ తన చారిత్రక గౌరవాన్ని కోల్పోకుండా ఉండేందుకు అడ్డంకులను తొలగించి, సరస్సులు, జలాశయాలు, పార్కులు మళ్లీ అసలు ఆకారంలోకి తీసుకురావాలని వెల్లడించారు.ఉదాహరణగా, బతుకమ్మ కుంట సరస్సు అడ్డంకులు తొలగించడం ద్వారా పునరుజ్జీవనమైందని ఆయన తెలిపారు.
మూసీ పునరుద్ధరణతో పాటు పాతబస్తీలో జీవనోపాధి, సౌకర్యాలను మెరుగుపరచడానికి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా హైదరాబాద్లోని ప్రజలకు మంచి జీవన ప్రమాణాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
